న్యూఢిల్లీ: బీమా పాలసీల కస్టమర్ల సమస్యలను మరింత సులువుగా పరిష్కరించడానికి, ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదులను దాఖలు చేసే సదుపాయాన్ని అందించడానికి ఐఆర్డీఏఐ త్వరలో కొత్త ఫిర్యాదుల విధానాన్ని ప్రారంభించనుంది. 2011లో ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ను (ఐజీఎంఎస్) కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అప్గ్రేడ్ చేస్తోంది. దీనిని ఇక నుంచి బీమా భరోసా అని పిలుస్తారు.
కొత్త పోర్టల్ ద్వారా ఫిర్యాదులను ఆన్లైన్లో ఇవ్వడానికి, ట్రాక్ చేయడానికి వీలవుతుంది. బీమా కంపెనీలపై ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డిఎఐ) కంప్లైంట్స్ రిపోజిటరీగా కూడా పనిచేస్తుంది. వివిధ సంస్థలపై ఫిర్యాదుల నమోదు, వివిధ దశల్లో వాటిని ప్రాసెస్ చేయడం, ఫిర్యాదులను చివరిగా ముగించడం వంటి అన్ని లావాదేవీలు ఈ పోర్టల్లో జరుగుతాయి.
బీమా కంపెనీలకు వ్యతిరేకంగా పాలసీదారులు తమ ఫిర్యాదులను 13 ప్రాంతీయ భాషలలో ఇవ్వవచ్చు. ఫిర్యాదు ఇవ్వడం కూడా ఇక నుంచి చాలా ఈజీగా ఉంటుంది. ఫిర్యాదుకు సంబంధించిన ఎనిమిది తప్పనిసరి ఫీల్డ్లను పూరిస్తే చాలు. పోర్టల్ ల్యాండింగ్ పేజీలోనే - 'కొత్త ఫిర్యాదు ఇవ్వండి' , ' ఫిర్యాదు పరిస్థితిని ట్రాక్ చేయండి' ఆప్షన్లు ఉంటాయి. కొత్త పోర్టల్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్/ఈ-మెయిల్ ఐడీకి ఎస్ఎంఎస్లు వస్తాయి.
బీమా కంపెనీ స్పందిస్తే.. ఆ సమాచారాన్ని కూడా పంపుతారు. కస్టమర్లు, బీమా పరిశ్రమల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక నిర్ణయాల్లో బీమా భరోసా ఒకటని ఐఆర్డీఏఐ వర్గాలు తెలిపాయి. ప్రిఫరెన్స్ షేర్లు, ఇన్సూరెన్స్ సబార్డినేట్ అప్పుల ద్వారా మూలధనాన్ని సమీకరించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన రూల్ను తొలగించాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది.