రామచంద్రాపురం, వెలుగు: భారత్ హెవీ ఎలక్ర్టిల్ లిమిటెడ్ రామచంద్రాపురం యూనిట్ హెచ్పీఈపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కేబీ రాజా సోమవారం పదవీ విరమణ పొందారు. 37 ఏళ్ల పాటు భెల్కు సుదీర్ఘ సేవలందించిన ఆయన ఎక్కడ ఉద్యోగం ప్రారంభించారో అక్కడే రిటైర్డ్ అయ్యారు. 2017 లో జీఎంగా పదోన్నతి పొందిన రాజా తర్వాత ఢిల్లీలో జాయింట్ ఎండీగా పదోన్నతి సాధించారు. గ్యాస్ టర్బైన్ ఇంజినీరింగ్ హెడ్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో రక్షణ, వైమానిక రంగాల్లో విభిన్నీకరణ, ఉక్రెయిన్ జోర్యా, నెదర్లాండ్స్ ఓప్రా సంస్థల ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు.
సోమవారం కేబీ రాజాకు భెల్ అధికారులు, ఉద్యోగులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. కేబీ రాజా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో పీఈఎస్డీ ఈడీ శ్రీనివాస రావుకి హెచ్పీఈపీ ఈడీ అదనపు బాధ్యతలు అప్పగించారు. యూనిట్ అభివృద్ధి, పురోగతికి తన వంతు కృషి చేస్తానని, భెల్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఉద్యోగులతో కలిసి మెలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నానని శ్రీనివాస రావు తెలిపారు.
