
చేవెళ్ల, వెలుగు : చేవెళ్ల సెగ్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేసిన అక్రమాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ను కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలను భీం భరత్ వివరించారు. సెగ్మెంట్ పరిధిలోని126, 145, 265 బూత్ల్లో100% పోలింగ్ జరిగిందన్నారు.
నవంబర్ 30న 1, 94, 343 వేల పోలింగ్ కు డిసెంబర్ 3న 1,94,834 వేల ఓట్లకు తేడా 491 ఓట్లతో ఫలితాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. 3 పోలింగ్ బూత్ల లో 100% పోలింగ్ ఉందని వీటిపైనా విచారణ జరపాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు కమిషనర్ వికాస్ రాజ్ సానుకూలంగా స్పందించిన తక్షణ విచారణకు ఆదేశించి, బాధ్యులైన వారిని కూడా విచారిస్తానని హామీ ఇచ్చినట్టు భీం భరత్ తెలిపారు.