కాంగ్రెస్​కు 80కి పైగా సీట్లు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్​కు 80కి పైగా సీట్లు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  •     డిసెంబర్​లో  సర్కార్​ ఏర్పాటు
  •     ఉమ్మడి జిల్లాలో సభలు,రోడ్​ షోలు

యాదాద్రి, వెలుగు :   ‘ఈ  ఎన్నికల్లో కాంగ్రెస్​ 80కిపైగా సీట్లు గెలుస్తుంది. డిసెంబర్​లో కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడుతుంది’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.   మొదటి కేబినెట్​ సమావేశంలోనే కాంగ్రెస్​ సీఎం ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తారని ఆయన తెలిపారు.  గురువారం యాదాద్రి జిల్లాలో రోడ్​షోలు, సభలు నిర్వహించి,  భువనగిరిలో ప్రెస్​మీట్​లో ,  ఆలేరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో   మాట్లాడారు.

తెలంగాణ సంపదను దోచుకుంటూ నియంతగా పాలిస్తున్న కేసీఆర్​ సర్కార్​కు ఈ ఎన్నికలతో  చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.     ఆలేరు, భువనగిరిలో బీర్ల అయిలయ్య, కుంభం అనిల్​కుమార్​రెడ్డి గెలుస్తారని చెప్పారు. కాంగ్రెస్​ సర్కారు ఏర్పడగానే.. ఎయిమ్స్​ను ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు.   బీర్ల అయిలయ్య గెలిస్తే..  తాను సీఎం అయినట్టే అని చెప్పారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20 లేదా 21న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తారని ఆయన తెలిపారు.  

నల్గొండ,భువనగిరిలో రోడ్​ షోలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు. భువనగిరి, ఆలేరులోనూ ఆయన ప్రచారం ఉంటుందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డితో  తీన్మార్​ మల్లన్న , కసిరెడ్డి నారాయణరెడ్డి, సీపీఐ లీడర్​ గోదా శ్రీరాములు, ఆకవరం మోహన్​రావు, వంచవీరారెడ్డి ఉన్నారు.