వాషింగ్టన్: మన దేశ మూలాలున్న మరో ఇద్దరిని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక పదవుల్లో నియమించారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వయిజరీ కౌన్సిల్(ఎన్ఐఏసీ) మెంబర్లుగా మను ఆస్థానా, మధు బెరివాల్ను అపాయింట్ చేసినట్లు గురువారం ప్రకటించారు. ఫిజికల్ దాడులు, సైబర్ నేరాలను ఎలా తగ్గించాలనే విషయాలపై ఈ కౌన్సిల్ ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఎన్ఐఏసీలో పనిచేసేందుకు ఫైనాన్స్, రక్షణ, కమ్యూనికేషన్ తదితర రంగాల్లో విశేష అనుభవం ఉన్న 26 మందిని బైడెన్ సర్కారు అపాయింట్ చేసింది.
అందులో ఆస్థానా, బెరివాల్ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ మార్కెట్లలో ఒకటైన నార్త్ అమెరికాలోని పీజేఎం ఇంటర్ కనెక్షన్కు మను ఆస్థానా సీఈవో, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇన్నోవేటివ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సంస్థకు సీఈవోగా బెరివాల్ కొనసాగుతున్నారు.