
- ఎంట్రీ ఇస్తున్న పెద్ద కార్పొరేట్ కంపెనీలు
- సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మొగ్గు
- వేటలో టెమాసెక్, కేకేఆర్, బ్లాక్స్టోన్ వంటి పీఈ కంపెనీలు
న్యూఢిల్లీ: హెల్త్కేర్ సెక్టార్ పెట్టుబడిదారులకు కొత్త బంగారు గనిగా మారుతోంది. ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత చాలా హాస్పిటల్స్ వాల్యుయేషన్స్ బాగా పడిపోయాయి. దీంతో వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి బడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. జనాభాకు తగ్గ బెడ్స్ లేకపోవడంతో హాస్పిటల్ సెక్టార్ మరింత విస్తరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
టెమాసెక్, బీపీఈఏ ఈక్యూటీ, బ్లాక్స్టోన్, కేకేఆర్ వంటి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు హాస్పిటల్ చెయిన్స్లో వాటాలను కొన్నాయి. ఈ సెక్టార్లో విలీనాలు బాగా పెరిగాయి. తాజాగా సహ్యాద్రి ఆసుపత్రులను రూ. 6,838 కోట్లకు (800 మిలియన్ డాలర్లకు) కొనుగోలు చేయడానికి మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ముందుకొచ్చింది. బ్లాక్స్టోన్, ఫోర్టిస్ హెల్త్కేర్ (ఐహెచ్హెచ్ బ్యాకింగ్కి వాటాలున్నాయి), ఈక్యూటీ పార్టనర్స్ ఈ సంస్థను కొనుగోలు చేయడానికి జూన్ 23న బిడ్లు సమర్పించాయి.
చిన్న నగరాల ఆకర్షణ..
లక్నో, విశాఖపట్నం, జైపూర్, కొచ్చి, సిలిగురి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా వంటి టైర్-2, టైర్-3 నగరాల్లో ఆసుపత్రులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నగరాల్లో వృద్ధి అవకాశాలు బాగుండడం, ఇక్కడి హాస్పిటల్ చెయిన్స్ వాల్యుయేషన్స్ తక్కువగా ఉండడం, నాణ్యమైన డాక్టర్లు, ప్రొఫెషనల్స్ దొరుకుతుండడంతో వీటి వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
సింగిల్- స్పెషాలిటీ ఆసుపత్రులు (ఐవీఎఫ్, నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఐ-కేర్, మదర్ అండ్ చైల్డ్కేర్) అధిక రాబడి ఇస్తున్నాయి. కన్సల్టెన్సీ కంపెనీ అవెండస్ విశ్లేషణ ప్రకారం, 2019 నుంచి హెల్త్కేర్ సెక్టార్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు పెట్టిన పెట్టుబడుల్లో 40 శాతం సింగిల్- స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్నాయి. ఇటువంటి హాస్పిటల్స్లోకి 2020–-2025 మధ్య మొత్తం 1.8 బిలియన్ డాలర్ల విలువైన 24 పీఈ/వెంచర్ క్యాపిటలిస్టుల (వీసీ) డీల్స్ జరిగాయి. ఇందులో 1.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ గత రెండేళ్లలోనే జరిగాయి.
భారీగా పెట్టుబడులు..
2022–-2024 మధ్య ఆసుపత్రులు 4.96 బిలియన్ డాలర్ల (రూ.42,500 కోట్ల) పీఈ పెట్టుబడులు, 3.2 బిలియన్ డాలర్ల (రూ.27,500 కోట్ల) ఎఫ్డీఐల (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్) ను ఆకర్షించాయి. మెర్జర్ అండ్ అక్విజేషన్ (ఎం అండ్ ఏ) డీల్స్ విలువ 6.74 బిలియన్ డాలర్లు (రూ.58 వేల కోట్లు) గా ఉంది. ఇదే టైమ్లో హాస్పిటల్ చెయిన్స్ ఐపీఓల ద్వారా 466 మిలియన్ డాలర్లను సేకరించాయి.
పెద్ద డీల్స్లో టెమాసెక్ హోల్డింగ్స్ (2 బిలియన్ డాలర్లు, మణిపాల్ హెల్త్లో వాటా), బీపీఈఏ ఈక్యూటీ (656 మిలియన్ డాలర్లు, ఇందిరా ఐవీఎఫ్), బ్లాక్స్టోన్ (591.1 మిలియన్ డాలర్లు, క్వాలిటీ కేర్) ఉన్నాయి. కేకేఆర్ ఫిబ్రవరి 2025లో హెల్త్కేర్ గ్లోబల్ (హెచ్సీజీ)లో 400 మిలియన్ డాలర్లకు కంట్రోలింగ్ వాటాను కొనుగోలు చేసింది.
హాస్పిటల్ సెక్టార్ వైపే ఎందుకంటే..
కోవిడ్ తర్వాత, ఫార్మా సెక్టార్తో పాటు ఆసుపత్రులు ఆకర్షణీయంగా మారాయి. జేఎం ఫైనాన్షియల్ ప్రకారం, ఆసుపత్రి రంగం మార్కెట్ క్యాప్ 2019–20లో రూ. 37,500 కోట్లు ఉంటే, 2023–24 లో రూ. 3.5 లక్షల కోట్లకు పెరిగింది. అపోలో హాస్పిటల్స్ షేర్లు 2024లో 28శాతం, మాక్స్ హెల్త్కేర్ 64శాతం పెరిగాయి. కేర్ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం, రాబోయే మూడేళ్లలో ఈ రంగం ఏడాదికి 12శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా.
లైఫ్స్టైల్ వ్యాధులు, హెల్త్కేర్ డిమాండ్, మెడికల్ టూరిజం పెరుగుతుండడంతో హాస్పిటల్ సెక్టార్ ఇన్వెస్టర్లకు హాట్కేక్లా కనిపిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, భారత్లో ప్రతి 10 వేల మందికి 16 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. రాబోయే 5-–7 సంవత్సరాల్లో లక్ష అదనపు బెడ్స్ అవసరం. దీంతో ఈ సెక్టార్ విస్తరించడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి.
దివాలా తీసిన ఆస్తుల కోసం వెతుకులాట..
కరోనా తర్వాత స్టాండెలోన్ (పెద్ద కంపెనీల మద్ధతు లేని) ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024లో ఆంకాలజీపై ఫోకస్ చేసే కర్కినోస్ హెల్త్కేర్ను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద రూ. 375 కోట్లకు కొనుగోలు చేసింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాక ఒత్తిడిలో ఉన్న హాస్పిటల్స్ దొరకడం కష్టంగా మారింది.
టాటా, బిర్లా, హిందూజా లాంటి కార్పొరేట్ కంపెనీలు కూడా హెల్త్కేర్లో ఉన్నాయి. బజాజ్ గ్రూప్ మెట్రో నగరాల్లో హాస్పిటల్ చెయిన్ స్థాపించడానికి రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పీఈ, వీసీ కంపెనీలు తక్కువ వాల్యుయేషన్కు దొరికే హాస్పిటల్ చెయిన్స్ కోసం వెతుకుతున్నాయి.