ఫోన్ ట్యాపింగ్, ఆధారాల ధ్వంసం చేశారనే అభియోగాల కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీస్ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వలను రద్దు చేయాలంటూ ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ వేయగా .. దీనిపై విచారించిన ధర్మాసనం అతని పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
బేగంపేటలోని ఎస్ఐబీ ఆఫీస్లో ప్రణీత్ రావుకు కేటాయించిన రెండు రూమ్స్ నుంచే ఈ సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ప్రణీత్ రావు ప్రత్యేకంగా హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్ను వినిమోగించినట్లు తెలిసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎలాంటి సాఫ్ట్వేర్ వినియోగించారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మొబైల్ యాప్స్ సహా ఇతర సాఫ్ట్వేర్స్ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను రాబడుతున్నారు. సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం డబ్బు ఎవరిచ్చారనే సమాచారం కూడా సేకరిస్తున్నారు.