కవ్వాల్‌‌ టైగర్‌‌ జోన్‌‌లో మళ్లీ పెద్దపులి అలికిడి..

కవ్వాల్‌‌ టైగర్‌‌ జోన్‌‌లో మళ్లీ పెద్దపులి అలికిడి..
  • టైగర్‌‌ జోన్‌‌లో నాలుగేండ్ల తర్వాత కదలికలు

జన్నారం, వెలుగు : కవ్వాల్ టైగర్‌‌ జోన్‌‌లో చాలాకాలం తర్వాత పెద్ద పులి అలికిడి కనిపించింది. 2012లో కవ్వాల్ టైగర్‌‌ ప్రాజెక్ట్‌‌ ఏర్పడిన నాటి నుంచి పెద్దపులి వచ్చి వెళ్లడమే తప్ప ఇప్పటివరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. పెద్ద పులిని రప్పించేందుకు ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కవ్వాల్ టైగర్ జోన్‌‌లోకి రాకుండా పక్కనున్న ఆసిఫాబాద్ అటవీ ప్రాంతం, మహారాష్ట్రలోని తాడోబా నుంచి రాకపోకలు కొనసాగించింది. చివరిసారిగా 2021లో తాళ్లపేట రేంట్​మహ్మదాబాద్​బీట్‌‌లో, కడెం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. 

ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదు. ఎట్టకేలకు జన్నారం అటవీ డివిజన్‌‌లోని ఇందన్‌‌పల్లి రేంజ్‌‌లో పులి సంచరించిన ఆనవాళ్లు దొరికాయి. మంగళవారం అటవీ ప్రాంతంలో ఓ ఆవు చనిపోగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ఆవు కళేబరాన్ని పరీశీలించి పులి దాడి వల్లే చనిపోయిందని నిర్ధారించారు. ఆవును చంపిన తర్వాత పులి ఎటువైపు వెళ్లిందన్న విషయంపై ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు.