అనుమానాస్పదంగా కార్మికుడు మృతి..కండ్లకోయ బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్ లో ఘటన

అనుమానాస్పదంగా కార్మికుడు మృతి..కండ్లకోయ బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్ లో  ఘటన

జీడిమెట్ల, వెలుగు: బిగ్​బాస్కెట్​ వేర్​హౌజ్​లో ఓ కార్మికుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్​ మండలం ఘనపూర్​కు చెందిన మేక బాబు(27) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి కండ్లకోయలోని బిగ్​బాస్కెట్​లో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం 9:30 గంటలకు రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. అతని భార్య ఫోన్​చేయగా ఫోన్​ స్విచాఫ్​ వచ్చింది.

 ఆదివారం ఉదయం మరోసారి ఫోన్​ చేయగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్​ దొరికిందని చెప్పాడు. అనంతరం మరో వ్యక్తి ఫోన్​ చేసి మీ భర్త డ్యూటీలో ఉండగా బాత్​రూమ్​లో జారిపడి మృతిచెందాడని చెప్పారు. బిగ్​బాస్కెట్​ నిర్వాహకులు పొంతన లేని సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులు బిగ్​బాస్కెట్​వేర్​ హౌజ్​ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.