సింగరేణి మెగా జాబ్ మేళాకు స్పందన

సింగరేణి మెగా జాబ్ మేళాకు స్పందన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సిటీలో ఆదివారం నిర్వహించిన సింగరేణి మెగా జాబ్ మేళాకు స్పందన వచ్చింది. ఇదే ప్రోగ్రాంలో సింగరేణిలో ఎంప్లాయిమెంట్​ పొందిన డిపెండెంట్లు 370 మంది డిపెండెంట్లకు నియామకపు పత్రాలను అందజేశారు.  కొత్తగూడెం క్లబ్​లో  ఏర్పాటు చేసిన మెగా జాబ్​మేళాను  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్​పా గౌతం పొట్రు, కలెక్టర్​ జితేష్​  వి పాటిల్​, ఎస్పీ బి.రోహిత్​ రాజుతో కలిసి సీఎండీ  ప్రారంభించారు. జాబ్​ మేళాకు ఆరు వేలకు పైగా నిరుద్యోగులు తరలివచ్చారు. దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి అధికారులు కృషి చేస్తున్నారు.  ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ గత పదేండ్లలో కొత్త బొగ్గు బ్లాకులను తెచ్చుకోలేకపోయామన్నారు. 

సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో కొత్త బొగ్గు బ్లాకుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో పలు చోట్ల మెగా జాబ్​ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మరో ఆరు నెలల్లో ఇంకో ఆరు వందల మందికి కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగ నియామకపు పత్రాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.  మన కాలనీలు,రోడ్లు, షాపింగ్​ కాంప్లెక్స్​ పాడు బడినట్టుగా ఉంటాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంతాల్లో కొత్త క్వార్టర్లు, షాపింగ్​కాంప్లెక్స్​, రోడ్లు నిర్మించాలన్నారు.

 పాల్వంచలో 800మెగావాట్ల విద్యుత్​ప్లాంట్లు రెండింటి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో సింగరేణి డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమలరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కె. రాజ్​ కుమార్, మిర్యాల రంగయ్య, త్యాగరాజన్​, వంగా వెంకట్, మల్లికార్జున్​, రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, జీఎం వెల్ఫేర్​ కిరణ్​ కుమార్​, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పి. వీరబాబు, సీఎంఓఏఐ ప్రెసిడెంట్​లక్ష్మీపతిగౌడ్, ఎస్వోటూజీఎం కోటి రెడ్డి పాల్గొన్నారు.