పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన బల పరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుండగా..బలపరీక్షలో నెగ్గాలంటే 122 మెజార్టీ మార్క్ను అందుకోవాలి. నితీశ్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 129 ఓట్లు వచ్చాయి. దీంతో నితీశ్ సర్కార్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
విశ్వాస పరీక్షలో నితీశ్ సర్కార్ గెలవడంతో 'మహాఘట్ బంధన్' కూటమికి చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ.." రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆర్జేడీ ప్రభుత్వం(2005 కి ముందు)లో అవినీతికి పాల్పడింది. వాళ్ల హయాంలో బిహార్లో అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. ఎక్కడా లా అండ్ ఆర్డర్ అమలు కాలేదు. దీనిపై ఎన్డీఏ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం విచారిస్తుంది" అని చెప్పారు. కాగా, నితీశ్ కుమార్ 'మహాఘట్ బంధన్' నుంచి వైదొలిగి ఎన్డీఏలో ఎందుకు చేరారో తెలియదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.