హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫిర్యాదులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘనపై వెంటనే స్పందించాలని ఎన్నికల అబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్, ఎంసీసీ కంట్రోల్ రూమ్ ను అబ్జర్వర్లు ఓం ప్రకాశ్ త్రిపాఠి, సంజీవ్ కుమార్ లాల్, జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి గురువారం తనిఖీ చేశారు.
కంట్రోల్ రూమ్ కు, సి–విజిల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వే లైన్స్ టీం, వీడియో సర్వే లైన్స్ టీం, వీడియో వ్యూవింగ్ టీం ద్వారా సమాచారం సేకరించి, చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.2.75 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఎంసీసీ ఉల్లంఘనలకు పాల్పడిన 10 మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని అబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ చెప్పారు. అనంతరం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ల అనుసంధానంపై ఇచ్చిన శిక్షణను పరిశీలించారు. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను పర్యవేక్షించారు.
