న్యూఢిల్లీ : నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్- సాకెట్- ఔట్లెట్లు, కేబుల్ ట్రంక్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు తప్పనిసరి నాణ్యత నిబంధనలను జారీ చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పకుండా ఉండాలి. లేకపోతే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు.
నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి కొన్ని సడలింపులను ఇచ్చారు. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్ప్రైజెస్కు 12 నెలలు అదనంగా ఇస్తారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండవ, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి.