
దేవరకొండ, వెలుగు: దేబీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. ఆదివారం నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డుగానీ, ఒక్క డబుల్ ఇల్లు కానీ ఇవ్వలేదన్నారు.
గత 30 ఏండ్లుగా దళితులకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ బిల్లుకై పోరాడుతున్న వారిని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టి అమలు చేసిందని గుర్తుచేశారు. కేటీఆర్, హరీశ్రావు, కవిత కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లీడర్లు దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
అంతకుముందు దేవరకొండ పట్టణంలో రూ. 1.35 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగై చింతపల్లి మండల పరిధిలోని శిరిడి సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు నాయిని జమున మాధవరెడ్డి, దొంతం అలివేలు సంజీవరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, ఆఫీసర్లు వెంకటేశం, హరీష్, రాజకుమార్, చత్రునాయక్ పాల్గొన్నారు.