
- కార్యకర్తలకైనా సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు బంధం ఎమ్మెల్సీ కవిత కామెంట్లతో బయటపడిందని విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య విమర్శించారు. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని ప్రశ్నించారు. కనీసం పార్టీ కార్యకర్తలకు అయినా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందంటూ సీఎం రేవంత్ ముందు నుంచి చెప్తున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కుటుంబాన్నే చక్కదిద్దుకోలేని కేటీఆర్.. ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందన్నారు. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముసుగు తొలగిందని పేర్కొన్నారు. ‘‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావటానికి కారణం బీఆర్ఎస్. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు 2 పార్టీలు ఏకం అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కవితను బయటికి పంపేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నడు. సొంత చెల్లిని చూసి ఓర్వలేని కేటీఆర్.. తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తడు?’’అని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశం పాతదే: అనిరుధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ఎమ్మెల్సీ కవిత చెప్పడం కొత్త కాదు. గత ఎన్నికల్లోనే ఇది రుజువైంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలు దిగజారిపోయి. ఆస్తి తగాదాలను కూడా రాజకీయం చేసుకుంటున్నారు. ఆస్తుల కోసమో లేక పదవి కోసమో సొంత కుటుంబంపైనే కొట్లాడే వాళ్లు ప్రజలకు ఏం సందే శం ఇస్తారు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ గెలిపించింది: సామ రామ్మోహన్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ గెలిపించింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అక్రమ సంబంధం బయటపెట్టి నందుకు కవితకు కృతజ్ఞతలు. కవిత నాకౌట్ మ్యాచ్లో బయటికి వచ్చారు. హరీశ్ రావు ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్లొచ్చు. సీఎం ఢిల్లీకి పోనీకి గాలి మోటార్ కొంటున్నడని కొందరు గాలి మాటలు మాట్లాడుతున్నరు. గాలి మాటలు మాట్లాడేటోళ్లు.. గాల్లో కలిసే రోజులు వచ్చాయి.