- తేజస్వీ హామీలు ఆచరణ సాధ్యం కావు: రవిశంకర్
- అది గఠ్ బంధన్ కాదు.. థగ్ బంధన్: గిరిరాజ్ సింగ్
హజీపూర్:
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు జరుగుతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ.. రంగ్దారి (దోపిడీ), జంగల్రాజ్(అరాచకం), దాదాగిరి(బెదిరింపులు)కి ప్రతీక అని విమర్శించారు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో నడ్డా ప్రసంగించారు. కాంగ్రెస్.. తన కూటమి భాగస్వామ్య పార్టీలను అంతం చేసే పరాన్నజీవి అని అన్నారు.
యువతకు ఉద్యోగాలిచ్చి వలసలు అరికడతామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీలు వింటుంటే.. గతంలో ఆర్జేడీ ప్రమేయం ఉన్న ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ గుర్తొస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఆర్జేడీ.. ఆ ఉద్యోగులకు చెల్లించేందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయో చెప్పాలన్నారు. గ్యాంగ్స్టర్లకు ఆ పార్టీ టికెట్లు ఇస్తున్నదని, ఇది బిహార్ భద్రతకే ప్రమాదమన్నారు.
ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే..
బిహార్ లోని ప్రతిపక్ష కూటమి గఠ్ బంధన్ కాదని, అది థగ్ బంధన్ (దొంగల కూటమి) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్అన్నారు. కొడుకు తేజస్వీయాదవ్ను లాలూప్రసాద్ బలవంతంగా సీఎం క్యాండిడేట్గా ప్రకటించేలా చేశారని ఎద్దేవా చేశారు. తమ ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని తెలిపారు. కాగా, తేజస్వీ యాదవ్ హామీలు ఆచరణ సాధ్యం కావని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘2.6 కోట్ల ఇండ్లలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనికి రూ.12 లక్షల కోట్లు ఖర్చవుతుంది. బిహార్ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు. ఈ ఉద్యోగాలనుఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు.
