- కాంగ్రెస్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
సిమ్లా: సినీ నటి, తమ అభ్యర్థి కంగనా రనౌత్ను అవమానిస్తున్నారని కాంగ్రెస్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె నటించిన సినిమాల్లోని ఫొటోలను తీసుకుని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని తెలిపింది. సోషల్ మీడియాలో కంగన పాత్రను కించపర్చాలని కాంగ్రెస్ తన అనుబంధ విభాగాలను ఆదేశించిందని బీజేపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో హమీర్ పూర్ యూత్ కాంగ్రెస్ ఆమెను అసభ్యకరంగా చిత్రీకరించిందని చెప్పింది. దీంతో కాంగ్రెస్పై చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ కోరింది. ‘‘తమకు ఇచ్చిన పాత్రను ఉత్తమంగా షోషించడం ప్రతి కళాకారుడి విధి. ప్రతి పాత్రకు దాని సవాళ్లు ఉంటాయి. కానీ, ఈ అంశాన్ని విస్మరించి కంగన పోషించిన పాత్రలను కాంగ్రెస్ అదే పనిగా ఉపయోగిస్తూ ఆమెను అసభ్యకరంగా చిత్రీకరిస్తుంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తుంది” అని బీజేపీ ఫిర్యాదు పేర్కొంది. ప్రమాదకరమైన ధోరణిని అనుసరిస్తున్న కాంగ్రెస్ బాధ్యతారహిత ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ ఈసీని కోరింది. కంగనపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని బీజేపీ వెల్లడించింది.