- కేసీఆర్పై ప్రతిపక్షాల మండిపాటు
- నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ దీక్షలు
- ఇయ్యాళ, రేపు కాంగ్రెస్ దీక్షలు, దిష్టిబొమ్మ దహనాలు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలకు బీఎస్పీ పిలుపు
దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ‘‘రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలి” అంటూ సీఎంపై మండిపడ్డాయి. మొదటి నుంచి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేసి కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘భీం దీక్షలు’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కామెంట్లను వెనక్కి తీసుకొని,ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎంను పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం, శుక్రవారం 48 గంటలపాటు దీక్షలు చేపడుతామని, రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ఎదుట కేసీఆర్
దిష్టిబొమ్మలు దహనం చేస్తామని చెప్పారు. సీఎం బాధ్యతారహితంగా మాట్లాడారని, దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు తెలపాలని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహాల వద్దకు చేరుకొని కేసీఆర్ మాటలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.