
కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 10, 11 వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాలని బీజేపీ కౌన్సిలర్ దాసరి సునీత, బీజేపీ శ్రేణులతో కలిసి బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మద్దెలచెరువు నుంచి వరద నీరు స్థానిక వార్డుల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతకుముందు రైల్వే స్టేషన్ సమీపంలోని కాంపౌండ్ నుంచి బీజేపీ లీడర్లు, వార్డు ప్రజలతో కలిసి సునీత–రాజశేఖర్ దంపతులు జోలపట్టి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. సమస్య పరిష్కరించాలని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నరేశ్, గణేశ్, అలేఖ్య, లీడర్లు రాజమురళి, తిరుమలవాసు, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.