
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘ఇండియా కూటమి’ సీనియర్ నేతలకు తన నివాసంలో ఇచ్చిన డిన్నర్లో శివసేన (యూబీటీ) చీఫ్ను చివరి వరుసలో కూర్చోబెట్టారంటూ బీజేపీ విమర్శలు చేసింది. కూటమిలో అదీ ఉద్దవ్స్థానం అంటూ ఎద్దేవా చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్రౌత్ చివరి వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ, శివసేన (యూబీటీ) మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఎన్డీయేలో శివసేన భాగస్వామిగా ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేవారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. తమకెప్పుడూ ఆయన గౌరవమే ప్రాధాన్యంగా ఉండేదని తెలిపారు. ఇండియా కూటమిలో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతున్నదో ఇప్పుడు చూస్తున్నామన్నారు.
ఢిల్లీ ముందు తలవంచకూడదని ఆయన ఎప్పుడూ చెప్పేవారని, అధికారం లేకపోవడంతో వారికి అలాంటి మర్యాద చేశారని, అది తనను బాధించిందన్నారు. ఆత్మగౌరవాన్ని, బాల్ఠాక్రే ఆదర్శాలను వదిలేసినవారు ఇలాంటి అవమానాల గురించి పట్టించుకోరని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే విమర్శించారు. వారి స్థానం ఏంటో కాంగ్రెస్ పార్టీ తెలిసొచ్చేలా చేసిందని అన్నారు.
ఎక్కడ కూర్చోవాలన్నది మా ఇష్టం: శివసేన
రాహుల్గాంధీ డిన్నర్లో సీటింగ్పై బీజేపీ చేసిన విమర్శలను శివసేన (యూబీటీ) తిప్పికొట్టింది. మీటింగ్లో ఎక్కడ కూర్చోవాలన్నది తమ నిర్ణయమేనని ఆదిత్య ఠాక్రే తెలిపారు. అక్కడ చర్చించే విషయం వారికి చిరాకు కలిగించడంతో.. తమ సీటుపై పడ్డారని బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల సంఘం చేస్తున్న కుట్రలను తాము బయటపెట్టడంతో బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేను ముందు వరుసలోనే కూర్చోమన్నారని, కానీ టీవీ స్క్రీన్ సరిగ్గా కనిపించాలనే తాము చివరి సీట్లలోకి వెళ్లామని క్లారిటీ ఇచ్చారు.