
- హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు
- రాష్ట్ర సర్కార్ నాన్చుతున్నదని ఆరోపణ
- సీబీఐకి అప్పగిస్తే లిక్కర్ కేసులాగే నీరుగారుస్తారని కాంగ్రెస్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతుండడంతో దానిపై బీజేపీ ఫోకస్పెట్టింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి అప్పగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేశారు. ఫోన్ట్యాపింగ్కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని, లేదంటే తామే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్తెస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తాజాగా ప్రకటించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా ఫోన్ ట్యాపింగ్కేసును సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కొందరు నిందితులను జైలుకు పంపింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు అరెస్ట్ కూడా తప్పదని తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో పోలీస్ఆఫీర్లు పాత్రదారులేనని, అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతామంటున్న సిట్ ఆఫీసర్లు.. కొద్ది రోజులుగా వందలాది మంది ఫోన్ ట్యాపింగ్బాధితులను పిలిపించి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలో ఫోన్ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా అడుగులు..
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. రాజకీయ నేతలు మొదలుకొని జర్నలిస్టులు, న్యాయమూర్తుల వరకూ వేలాది మంది ఫోన్లను గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్ చేసింది. వీరిలో కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్నేతలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని అందులో కోరారు.
ఈ కేసును సిట్ లోతుగా విచారించడం లేదని ఆరోపించారు. ఈ కేసులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్ రెడ్డి కూడా ఫోన్ట్యాపింగ్పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అక్కడా విచారణ కొనసాగుతున్నది. ఇక ఈ కేసును రాష్ర్ట ప్రభుత్వం వదిలేసినా.. తాము మాత్రం వదిలే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జోక్యం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేలా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎంపీ అర్వింద్ కోరారు.
బీజేపీ నేతలకు కాంగ్రెస్ కౌంటర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతిరోజూ పదుల సంఖ్యలో బాధితుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీరిలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో పాటు జాతీయ నేతలూ ఉంటున్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ కావడంతో ఆయన పీఏ సిట్ ముందు హాజరయ్యారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, అర్వింద్, ఈటల రాజేందర్, వాళ్ల అనుచరుల ఫోన్లు ట్యాప్కాగా.. వారి నుంచి కూడా సిట్వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే కేసును సీరియస్గా తీసుకున్న ఆ పార్టీ ముఖ్య నేతలు కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలకు కాంగ్రెస్ లీడర్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్కేసులో సిట్సీరియస్గా విచారణ చేస్తోందని, ఇప్పటికే పలువురు నిందితులను జైలుకు పంపిందని గుర్తు చేస్తున్నారు. తెరవెనుక సూత్రధారులను బయటకు రప్పించేందుకు కొద్ది రోజులుగా వందలాది మంది బాధితుల నుంచి సిట్ వాంగ్మూలాలు సేకరిస్తున్నదని చెప్పారు. ‘‘కేంద్రంలోని బీజేపీకి, బీఆర్ఎస్కు దోస్తీ ఉంది. అందువల్లే లిక్కర్కేసు నుంచి కవిత బయటపడ్డారు. ఇప్పుడు ఫోన్ట్యాపింగ్కేసును సైతం సీబీఐకి అప్పగిస్తే కేసును నీరుగార్చే ప్రమదం ఉంది” అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
సీబీఐకి ఇవ్వాల్సిందే: చింతల
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. అందువల్లే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసును నాన్చుతున్నది. కేవలం టైమ్పాస్ కోసం విచారణ చేస్తోంది” అని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే దాకా ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో పోరాడుతామని చెప్పారు.