
మోడీ తొమ్మిదేండ్ల పాలనపై 30 నుంచి స్పెషల్ ప్రోగ్రామ్లు
రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
ప్రోగ్రామ్ ల సక్సెస్ కోసం తొమ్మిది మందితో కమిటీ
22 నుంచి బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు : మోడీ తొమ్మిదేండ్ల పాలనపై ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’’ పేరుతో ఈ నెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వరుస కార్యక్రమాలకు రెడీ అవుతోంది. నెలరోజులపాటు ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లు నిర్వహించనున్నారు. ప్రధానిగా మోడీ సాధించిన విజయాలు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ లు జరగనున్నాయి. ప్రోగ్రామ్లను సక్సెస్ చేసేందుకు తొమ్మిది మంది పార్టీ నేతలతో కమిటీని నియమించారు. ఈ కమిటీకి కన్వీనర్ గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు వ్యవహరించనున్నారు. .కమిటీ సభ్యులుగా పార్టీ లీడర్లు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్వీ సుభాష్, కట్టా సుధాకర్, పాపారావు, భరత్ గౌడ్, చంద్రశేఖర్, వెంకట రమణలను నియమించారు.
జూన్ 23 న పది లక్షల బూత్ కమిటీలతో మోడీ వర్చువల్ సమావేశం
దేశవ్యాప్తంగా జూన్ 23 న సుమారు పది లక్షల బూత్ కమిటీలతో ప్రధాని మోడీ వర్చువల్ గా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 22 న హైదరాబాద్ శివారులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుండగా, 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కార్యవర్గ సమావేశాలు, 25, 26 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చెప్పారు.