
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ ఆఫీసులో కార్యకర్తలకు కనీసం రోజుకో ప్రజా ప్రతినిధి అందుబాటులో ఉండేలా ఆ పార్టీ కొత్త విధానం అమలు చేస్తోంది. దీన్ని సోమవారం నుంచే అమలు చేసేలా ప్లాన్ రెడీ చేసింది. ఇందుకోసం స్టేట్ ఆఫీసులోని ఫస్ట్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా102 నెంబర్ రూంను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇకపై ప్రతి రోజూ పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.
జూన్ 2న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, జూన్ 3న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జూన్ 4న ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జూన్ 5న ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జూన్ 6న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజా ప్రతినిధులంతా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కాగా, పార్టీ కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య గ్యాప్ ను తొలగించేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.