లాక్ డౌన్ లో క్రికెట్ మ్యాచ్: బీజేపీ లీడ‌ర్ స‌హా 20 మంది అరెస్టు

లాక్ డౌన్ లో క్రికెట్ మ్యాచ్: బీజేపీ లీడ‌ర్ స‌హా 20 మంది అరెస్టు

లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞ‌ప్తులు చేస్తున్నా కొంద‌రు మాత్రం వాటిని ల‌క్ష్య‌పెట్ట‌ట్లేదు. పోలీసులు కూడా అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించ‌కుండా వారిపై ప‌లు కేసులు న‌మోదు చేస్తున్నారు. తాజాగా‌ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించినందుకు ఓ బీజేపీనాయకుడితో సహా 20 మందిపై గురువారం పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా టికైట్ నగర్ ప్రాంతంలోని పనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత సుధీర్‌సింగ్‌ కొంద‌రు యువ‌కుల‌తో క్రికెట్‌ మ్యాచ్‌ను నిర్వహించారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో 20 మందికి పైగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారని.. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందడంతో.. పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని, ఆ మ్యాచ్ ను ఆడ్డుకున్నార‌ని జిల్లా ఎస్పీ అర‌వింద్‌ చతుర్వేదీ తెలిపారు.

ఈ వ్య‌వ‌హారంలో బీజేపీ నాయకుడు సుధీర్ సింగ్, అతని కుటుంబ సభ్యులు , అలాగే గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులపై సెక్షన్ 269 , సెక్ష‌న్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామ‌ని ఎస్పీ అన్నారు.