గిరిజనుల భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు : కొయ్యల ఏమాజీ

గిరిజనుల భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు :  కొయ్యల ఏమాజీ

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవుల అభివృద్ధి పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ హెచ్చరించారు. ఆదివారం నెన్నెల మండలంలోని చిత్తాపూర్​లో బీజేపీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్​తో కలిసి గిరిజన కుటుంబాలను కలిసి మాట్లాడారు. 

చిత్తాపూర్​లో 82 మంది గిరిజనుల భూములను అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని, గత 30 ఏండ్లుగా ఆ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. 20 మంది గిరిజన రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుకు పంపడం అన్యాయమన్నారు. పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ ​చేశారు. 

గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వారి భూములను లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఒడం కమల, ఉప సర్పంచ్ ​వెంకటేశ్​ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోవర్దన్, శ్రావణ్​ కుమార్, నర్సింగ్, యాదగిరి, శ్రీనివాస్​ గౌడ్​తదితరులు పాల్గొన్నారు.