ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నేతల ప్రెస్మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కనీస విచారణ జరపడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల మృతిపై రాష్ట్రపతికి తొందరగా నివేదిక పంపకపోతే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్కు రాహుల్ గాంధీ ఎలాగో, టీఆర్ఎస్కు కేటీఆర్ అలా తయారయ్యారన్నారు కృష్ణసాగర్ రావు. కేటీఆర్ ప్రాస కోసం గోస పడుతున్నారని.. ప్రతి మీటింగ్ అతని కష్టం చూస్తే జాలేస్తోందన్నారు. కేటీఆర్ మాట్లాడేది అర్ధం కాక కొందరు చప్పట్లు కొడితే… కేటీఆర్ మాత్రం సంబరపడుతున్నారని తెలిపారు. బీజేపీ నాయకులం ఎంత ప్రయత్నించినా.. కేటీఆర్లా వ్యక్తిగత దూషణలు చేయలేక పోతున్నామన్నారు. రాష్ట్రానికి అదృశ్య సీఎం అయిన కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తన కొడుకుతో ఎదురుదాడి చేయిస్తే సరిపోదన్నారు. గడిచిన ఆరేళ్లలో ఏం చేశారో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని కేటీఆర్కు సవాలు విసిరారు కృష్ణసాగర్ రావు.