- ప్రతిపక్షాల నిరాశ ఆయన మాటల్లో స్పష్టం
- 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమిలోని పార్టీలు గల్లంతే
కోల్కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి బాధ్యుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధేనని, ప్రతిపక్షాల్లోని నిరాశ ఆయన మాటల్లోనే కనిపిస్తున్నదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చురకలంటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో ఓడిపోయిన తర్వాత కూటమిలోని చాలా పార్టీలు ఎలక్షన్ కమిషన్నుంచి గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)తో ఏదో జరిగిపోతుందని భయం వద్దని సూచించారు. ‘సీఏఏతో ముస్లింలుసహా దేశంలోని ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరుగదు. దేశంలో మత ఘర్షణలు, గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’ అని మండిపడ్డారు. బీజేపీ సర్కారు మూడోసారి కూడా నిర్ణయాత్మక విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి సరైన నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నదని, దానికి ఓ విధానమంటూ లేదని విమర్శించారు.
అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఆశయాలు కూటమికి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. ఇండియా కూటమికి బీజేపీతో పోటీకాదని.. నాయకత్వంకోసం కూటమిలోని పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని చురకలంటించారు. ఆ కూటమిలోని ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలనే లక్ష్యం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని రిమోట్ కంట్రోల్డ్ గవర్నమెంట్ను కోరుకోవడం లేదని అన్నారు.