ఎంపీలు, ఎమ్మెల్యేలను సెక్రటేరియట్ లోకి అనుమతివ్వకపోవడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసీఆర్ ప్రజా సమస్యలను వినడు.. తాము చెబుదామంటే సెక్రటేరియట్ కు రానివ్వరన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి.. ప్రజా సమస్యలపై చర్చ జరిగితే కేసీఆర్ కు జనం సమస్యలు తెలిసేవన్నారు. చిన్నపాటి వానకే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే మున్సిపల్ మంత్రి కానీ, మేయర్ కానీ పట్టించుకోవడం లేదన్నారు.
సైబరాబాద్ కమిషనర్ వచ్చి హైటెక్ సిటీలో నిలబడితే తప్ప ట్రాఫిక్ క్లియర్ కాలేని పరిస్థితి ఉందన్నారు రఘునందన్ రావు. మున్సిపల్ మంత్రికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, సమస్యలపై అవగాహన లేదన్నారు. తాము సూచించిన టైంకే సాఫ్ట్ వేర్ కంపెనీలు నడపాలి లేదంటే.. మూసేసుకోవాలనే పరిస్థితి వచ్చిందంటే..హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాలన్నారు. మున్సిపల్ మంత్రి ఒక్కనాడైనా జీహెచ్ఎంసీ సమావేశాలకు అటెండ్ కారు..హైదరాబాద్ సమస్యలపై చర్చించరు.. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ధ్వజమెత్తారు. అటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే టైమివ్వరు .. ఇటు జీహెచ్ఎంసీ సమావేశాలను పట్టించుకోరని మండిపడ్డారు. దండం పెట్టి దరఖాస్తు ఇద్దామంటే సెక్రటేరియట్ కు రానివ్వరని రఘునందన్ రావు అన్నారు.