- 60 ఏండ్లుగా అక్కడే.. ఇప్పటికీ దాని ఆచూకీ మిస్టరీనే
- చైనాపై గూఢచర్యం కోసం భారత్తో కలిసి అమెరికా మిషన్
- నందా దేవి పర్వత శిఖరాన యాంటెన్నా ఏర్పాటుకు ప్రయత్నం
- మంచు తుఫాన్ కారణంగా ఫ్లుటోనియంతో కూడిన అణు పరికరం మిస్
- ఆ పరికరం దెబ్బతింటే గంగానదిలో రేడియేషన్ కలుషితం
- లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు!
న్యూఢిల్లీ: అరవై ఏండ్ల కిందట చైనాపై గూఢచర్యం కోసం అమెరికా చేపట్టిన మిషన్.. ఇప్పుడు భారత్కు పెనుముప్పుగా మారింది. కోల్డ్వార్ సమయంలో చైనాపై నిఘా కోసం భారత్తో కలిసి అమెరికా నిర్వహించిన మిషన్ ఫెయిల్ కావడం తాజాగా భయాన్ని రేకెత్తిస్తున్నది. హిమాలయాల్లోని నందాదేవి పర్వత శిఖరాన అమెరికా వదిలేసి వెళ్లిపోయిన న్యూక్లియర్ డివైజ్ గంగా నదికి ముప్పుగా మారింది. ఒకవేళ ఆ పరికరం దెబ్బతింటే గంగానది కలుషితమై.. లక్షలాది మంది భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన పోస్ట్ వైరల్ కావడంతో.. ఈ డివైజ్పై భయాందోళనలు నెలకొన్నాయి.
అసలేం జరిగిందంటే?
1965లో కోల్డ్వార్ తారాస్థాయిలో ఉన్న సమయంలో చైనా అణు పరీక్షలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ.. భారత్ ఇంటలిజెన్స్ బ్యూరోతో కలిసి ఓ కోవర్ట్ ఆపరేషన్ను చేపట్టింది. చైనా అణు పరీక్షలను పర్యవేక్షించేందుకు హిమాలయాల్లోని నందా దేవి పర్వతంపై అణుశక్తితో నడిచే యాంటెన్నాను రహస్యంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ పరికరం రేడియో ఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ (ఆర్టీజీ) ఆధారంగా పనిచేస్తుంది. ఈ మిషన్లో కీలకమైన వస్తువు ‘ఎస్ఎన్ఏపీ-19సీ’ అనే 13 కిలోల బరువున్న జనరేటర్. ఇందులో నాగసాకిపై వేసిన బాంబులో వాడిన ఫ్లుటోనియంలో దాదాపు మూడింట ఒక వంతు ఉండేది. 1
965 సెప్టెంబర్లో ఇండియన్ నేవీ ఆఫీసర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలోని టీం.. అమెరికా బృందంతో కలిసి నందాదేవి శిఖరం నాలుగో క్యాంప్ వరకు ఆర్టీజీ జనరేటర్, యాంటెన్నా, ఏడు ఫ్లుటోనియం క్యాప్సుల్స్, రెండు ట్రాన్స్రిసీవర్ సెట్లను తీసుకెళ్లింది.
మంచు తుఫాన్ కారణంగా వాటిని అక్కడే వదిలేసి వచ్చింది. ఏడాది తర్వాత వెళ్లగా.. ఆ అణు పరికరం కన్పించలేదు. తుఫాను కారణంగా అది ఎక్కడో మంచులో కూరుకుపోయిందని భావించారు.
గంగానదికి పెనుముప్పు!
హిమాలయాల మంచులో ఆ ఫ్లుటోనియం ఎక్కడుందో నేటికీ తెలియదు. ఈ జనరేటర్ కనిపించకుండా పోయిన గ్లేసియర్ నుంచే గంగానదిలోకి నీరు చేరుతుంది. ఒకవేళ ఈ పరికరం దెబ్బతింటే దాని నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంగానది కలుషితంగా మారి ఆ పరీవాహక ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
