- మిత్రపక్షానికి కాంగ్రెస్ మేలు.. రాజకీయ ప్రేరేపిత విభజన: పాల్వాయి హరీశ్ బాబు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన మజ్లిస్కు కట్టబెట్టేందుకే మూడు కార్పొరేషన్లుగా విడగొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత విభజన అని విమర్శించారు. జీహెచ్ఎంసీ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఒక్కో డివిజన్లో సగటున 30 వేల జనాభా ఉండాలని.. కానీ, విభజనలో మాత్రం ఒక డివిజన్లో 82 వేలు, ఇంకో డివిజన్లో మాత్రం 12 వేలు ఉందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జీహెచ్ఎంసీని రాజ్యాంగానికి విరుద్ధంగా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారన్నారు. ఒకపక్క జనగణన జరుగుతున్నప్పుడు విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2005 డిసెంబర్ నుంచి 2027 మే వరకు బౌండరీలు మార్చొద్దని సెన్సస్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలున్నా.. విభజన ఎలా చేశారని నిలదీశారు. హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్లతో నింపుతామని గతంలో ఒక పెద్ద మనిషి (కేసీఆర్ను ఉద్దేశించి) చెప్పారని, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఫాంహౌస్కే పరిమితమయ్యారని హరీశ్బాబు విమర్శించారు.
ఇప్పుడున్న నాయకులేమో మూసీని గోదావరి నీళ్లతో నింపుతమంటున్నారని.. మరి, ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. అనంతరం డ్రగ్స్ అంశంపై పాల్వాయి హరీశ్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం నడిచింది. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిందని, స్కూళ్లు, పాన్షాపుల వరకు పాకిందని హరీశ్ బాబు విమర్శిస్తే.. అసలు గుజరాత్లోని పోర్టుల నుంచే ఇక్కడికి అవి వస్తున్నాయని, కేంద్ర హోం శాఖ ఏం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు.
