- ఎన్నికల ఖర్చుపై ఈసీ నోటీసులు
- అనర్హత వేటుకు అవకాశం?
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ చిక్కుల్లో పడ్డారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గురుదాస్ పూర్ నుంచి డియోల్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, ప్రచార ఖర్చులపై ఎలక్షన్ కమిషన్ విధించిన రూ.70 లక్షల పరిమితిని మించి డియోల్ ఖర్చు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రచారం కోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఈసీ బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రచార వ్యయం పరిమితిని దాటిన నేతలపట్ల ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎన్నికైన అభ్యర్థి ప్రచార వ్యయం లిమిట్దాటిందని తేలితే.. సదరు అభ్యర్థిని అనర్హుడిగా, సమీప అభ్యర్థిని విజేతగా ప్రకటించే అధికారం ఈసీకి ఉంది. పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి చివరి క్షణంలో సన్నీడియోల్ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ జక్కర్పై 80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.