కుటుంబ పార్టీలను ఓడించాలి .. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పిలుపు

కుటుంబ పార్టీలను ఓడించాలి ..  బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పిలుపు

వనపర్తి, వెలుగు: వారసత్వ రాజకీయాలు చేస్తూ, కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెడుతున్న పార్టీలను ఓడించి ఇంటికి పంపాలని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్విసూర్య పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తేజస్వి సూర్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం అంటే వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజకీయ నేపథ్యం లేని, విద్యావంతుడు అనూజ్ఞరెడ్డికి వనపర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. వనపర్తి మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు వనపర్తి, కొత్తకోటలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వెంకట్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కేశవులు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జనసేన జిల్లా అధ్యక్షుడు ముకుంద నాయుడు, బీజేపీ నాయకులు బుడ్డన్న, ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.