న్యూఢిల్లీ: బీజేపీ వ్యూహం ఫలించింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ రూపొందించిన బిల్లు రాజ్యసభలో గట్టెక్కుతుందా లేదా అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. సభలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో బిల్లు పాస్ కాదని రాజకీయ వర్గాల్లో తొలుత చర్చ నడిచింది. అప్పటికప్పుడు చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితి మారిపోయింది. దీని వెనుక బీజేపీ పకడ్బందీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. లోక్సభలో భారీ మెజారిటీతో బిల్లును పాస్ చేయించుకున్న ప్రభుత్వం.. రాజ్యసభలోనూ తన పట్టును నిలుపుకొంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 241. అందులో ఎన్డీయే కన్నా ప్రతిపక్షాలు, తటస్థ పార్టీల బలమే ఎక్కువ. మొత్తం సభ్యులు సభకు హాజరైతే బిల్లు పాస్ కావాలంటే 121 మంది (మ్యాజిక్ ఫిగర్) మద్దతు కావాలి. ఎన్డీయేకు ఉన్నది 107 మంది సభ్యుల బలమే. ఈ నేపథ్యంలో బిల్లు వీగిపోతుందని అందరూ భావించారు. పైగా మొదటి నుంచి ఎన్డీయేలోని అన్నాడీఎంకే, జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలు సభకు రాకపోతే.. ప్రతిపక్షాల బలం మరింత ఎక్కువై బిల్లు వీగిపోయేది. కానీ పలు తటస్థ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండటం, బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీల్లోని సభ్యులు కొందరు సభకు రాకపోవడంతో ఒక్కసారిగా మ్యాజిక్ ఫిగర్ 93కి పడిపోయింది. దీంతో ఎన్డీయేది పైచేయి అయింది.
వ్యతిరేకించిన మిత్రపక్షాలు
ఎన్డీయే కూటమిలోని జేడీయూ, అన్నాడీఎంకే ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. జేడీయూకు ఆరుగురు, అన్నాడీఎంకేకు 11 సభ్యుల బలం ఉంది. జేడీయూ సభ్యులు సభకు రాకపోగా.. అన్నాడీఎకే సభ్యులు వాకౌట్ చేశారు. ఫలితంగా ఓటింగ్ సమయంలో సభలో అధికార ఎన్డీయే బలం 90కి పడిపోయింది. కానీ.. ఏడుగురు సభ్యులున్న నవీన్పట్నాయక్ పార్టీ బీజేడీ బిల్లుకు మద్దతుగా ఓటు వేసింది.
వైఎస్సార్సీపీ నుంచి ఒక్కరే వచ్చి వ్యతిరేకించి..
బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించింది. ఆ పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండగా.. ఓటింగ్ సందర్భంగా కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
దూరంగా టీఆర్ఎస్
టీఆర్ఎస్కు రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. చర్చలో, ఓటింగ్లో వారెవరూ పాల్గొనలేదు. బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ వాకౌట్ చేసింది. మొన్నటివరకు టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉండగా నలుగురు ఇటీవలే బీజేపీలో విలీనమవగా.. మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు మాత్రమే మంగళవారం సభకు హాజరై.. వాకౌట్ చేశారు.
ప్రతిపక్ష సభ్యుల్లో చీలిక
యూపీఏ కూటమిలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచే నలుగురు సభ్యులు సభకు దూరంగా ఉన్నారు. అందులో ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటివారు ఉన్నారు. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ ప్రఫుల్ పటేల్ కూడా సభకు రాలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన ఇద్దరు సభ్యులు, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఆర్జేడీకి చెందిన రాంజఠ్మలానీ కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మొత్తంగా ఆరు పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండగా.. ప్రతిపక్షంలోని పలువురు సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. ఇలాంటి పరిణామాల్లో ఓటింగ్ సమయానికి సభలో 183 మంది సభ్యులే ఉన్నారు. 99 మంది అనుకూలంగా.. 84 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు పాస్ అయింది. బిల్లును వ్యతిరేకించే మిత్రపక్షాలు అన్నాడీఎంకే, జేడీయూలను ఓటింగ్కు దూరంగా ఉంచడంలో, పలు పార్టీలను కూడా సభకు రాకుండా చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, అందుకే సభలో మ్యాజిక్ ఫిగర్ పడిపోయి బిల్లుకు గ్రీన్సిగ్నల్ లభించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యతిరేకించే పార్టీలన్నీ ఓటువేసి ఉంటే.. బిల్లు గట్టెక్కేది కాదని చెప్తున్నారు. గత వారం ఆర్టీఐ యాక్ట్ విషయంలోనూ రాజ్యసభలో ఇలాంటి స్ట్రాటజీనే బీజేపీ ఉపయోగించింది. అప్పుడు కొన్ని తటస్థ పార్టీలకు ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ఫోన్ చేసి బిల్లుకు మద్దతు కూడగట్టారు.