కమ్యూనిస్టులపై బీజేపీ కుట్రలు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కమ్యూనిస్టులపై బీజేపీ కుట్రలు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • మోదీ, అమిత్​ షాకు హిట్లర్​ గతే పడుతుంది
  • బనకచర్లపై ఇద్దరు సీఎంలు చర్చించి నీటివాటా తేల్చాలి  
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మంచిర్యాల, వెలుగు: దేశంలో కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్లను నిర్మూలించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శనివారం సీపీఐ మంచిర్యాల జిల్లా నాల్గవ మహాసభకు ఆయన హాజరయ్యారు. ఐబీ చౌరస్తా నుంచి ర్యాలీ అనంతరం గ్రౌండ్​లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎర్రజెండా లేకుండా చేస్తామంటున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాలకు నియంత హిట్లర్​కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

ఆపరేషన్  సిందూర్​ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్  చేశారు. ఆపరేషన్  కగార్​ పేరిట మావోయిస్టులను చంపుతోందని, శాంతి చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా, మారణహోమం సాగిస్తోందన్నారు. మిగిలిన 11 మంది మావోయిస్టు అగ్రనేతలను సైతం ఎన్​కౌంటర్ల పేరిట హతమార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. మారణహోమాన్ని వెంటనే నిలిపివేసి రాజ్యాంగబద్ధంగా మావోయిస్టుల సమస్యను పరిష్కరించాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల దగ్గర వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ, ఏపీ సీఎంలు కలిసి చర్చించి గోదావరి నీటివాటాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. కమ్యూనిస్టులను అణిచివేయడం సాధ్యం కాదని, ఉద్యమాల రూపంలో మరింత బలపడుతామని తెలిపారు. ప్రెస్​మీట్​లో పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల దాసు పాల్గొన్నారు.