- రెండో ప్రధాన ప్రతిపక్షంగా ఆప్
న్యూఢిల్లీ: ఇటీవల 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. తాజా ఫలితాలతో బీజేపీ ప్రస్తుతం ఏ పార్టీ మద్దతు లేకుండా దేశంలోని12 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం చేజిక్కించుకున్నట్లయ్యింది. అంతేకాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం)ని అధికార కూటముల్లో బీజేపీ భాగంగా ఉంది. బీజేపీ ప్రస్తుతం ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో అధికారంలో ఉంది. ఆదివారం వెలువడిన ఫలితాల ద్వారా మధ్యప్రదేశ్ను తిరిగి పొందడంతో పాటు రాజస్థాన్, చత్తీస్గఢ్లను కాంగ్రెస్ నుంచి లాగేసుకుంది. ఇక.. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. తాజా ఫలితాల్లో రాజస్థాన్, చత్తీస్గఢ్ల్లో అధికారం కోల్పోయింది. దీంతో ఆ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య మూడుకు పడిపోయింది.
కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఇప్పుడు సొంతంగా అధికారంలో ఉండనుంది. బీహార్, జార్ఖండ్లోని అధికార కూటముల్లో భాగంగా ఉండనుంది. అలాగే..తమిళనాడును పాలించే డీఎంకేకు మిత్రపక్షంగా వ్యవహరించనుంది. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆప్తాజా ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని దేశంలో రెండో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మార్చాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉండగా..రెండు రాష్ట్రాల్లో( ఢిల్లీ, పంజాబ్) ఆప్ అధికారంలో ఉంది. దీని వల్ల ఆప్ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దేశంలో ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు( బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆప్) మాత్రమే ఉన్నాయి. వచ్చే ఏడాది సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి.