మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

మునుగోడు డెవలప్మెంట్ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం తీసుకునే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. 500 రోజుల్లో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేంద్రం పెద్దలతో మాట్లాడే ఈ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు బీజేపీయే శ్రీరామ రక్ష అన్న ఆయన.. రాష్ట్రం బాగుపడాలంటే తమ వల్లే సాధ్యమని చెప్పారు. కనీసం రోడ్లు వేయిద్దామన్నా.. కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదని రాజగోపాల్ వాపోయారు. 

నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు. చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, చౌటుప్పల్ లో రూ. 25 కోట్లతో ఐటీఐ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడులో సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మర్రిగూడలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్ లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తామని రాజగోపాల్  స్పష్టం చేశారు. 

నిరుద్యోగుల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రకటించారు. నిరుద్యోగులకు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు వీధి వ్యాపారులకు రూ.10 వేల సాయం అందిస్తామని చెప్పారు. చౌటుప్పల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తో పాటు రూ. 100 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమృత్ సరోవర్ పథకం కింద వాటర్ ట్యాంకులు నిర్మించి తాగు నీటి కష్టాలు దూరం చేస్తానని మాట ఇచ్చారు.