మజ్లిస్, కాంగ్రెస్​ కుట్రలకు కేసీఆర్​ సపోర్ట్

మజ్లిస్, కాంగ్రెస్​ కుట్రలకు కేసీఆర్​ సపోర్ట్

సీఏఏ, ఎన్పీఆర్ పై ఏ చర్చకైనా సిద్ధం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం దేశ ప్రయోజనాల కోసం చట్టాలు చేస్తే.. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మతం రంగు పులుముతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్  ఆరోపించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్ లపై ఏ పార్టీతోనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్​ ఒకేతాను ముక్కలని.. నిజామాబాద్​ మజ్లిస్​ సభకు టీఆర్ఎస్​ ప్రతినిధులను పంపుతాననడం, కాంగ్రెస్, కమ్యూనిస్టులనూ పిలవాలని  కేసీఆర్  సూచించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. సీఏఏ భారతీయ ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకపోతే కేసీఆర్, అసదుద్దీన్​ ఒవైసీ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్​ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు.

మీరు సమగ్ర కుటుంబ సర్వే చేయలేదా?

రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డ వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిందని, అందులో పేర్లు నమోదు చేయించుకోని వాళ్లు తెలంగాణ వాళ్లే కాదన్నట్లు బిల్డప్ ఇచ్చిందని లక్ష్మణ్​ గుర్తు చేశారు. అది రైటే అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ, సీఏఏ చట్టం తప్పెలా అవుతుందని నిలదీశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు టైమివ్వని సీఎం.. మత రాజకీయాలు చేసే అసదుద్దీన్​తో మూడు గంటలు మంతనాలు సాగించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, మజ్లిస్​కుట్రలకు టీఆర్ఎస్  మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మున్సిపల్ ఎన్నికలపై హడావుడి చేస్తున్నారన్నారు.

ఈ రోజు వర్క్‌‌‌‌ షాప్..

సీఏఏపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు, వాస్తవాలు తెలిపేందుకు 30న హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు లక్ష్మణ్​ తెలిపారు. ఇక పార్టీ నేతలకు సీఏఏపై శనివారం (28న) పార్టీ రాష్ట్ర ఆఫీస్‌‌‌‌లో వర్క్​షాప్​ నిర్వహించనున్నట్టు తెలిపారు.

BJP state chief Laxman has accused the TRS, Majlis, Congress and Left parties of treason in the state