
2014 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో దానికి గట్టిగా సమాధానం చెప్పాలని అధికారపార్టీ నిర్ణయించి నట్టు తెలిసింది. ప్రతిపక్షాల ఆరోపణల్ని తిప్పి కొట్టేందుకు వీలుగా నరేంద్రమోడీ సర్కార్ ఐదేళ్లపాలనలో చేపట్టిన కార్యక్రమాలు, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు , వాటి అమలుతీరును ప్రజలకు వివరించే పనిలో బీజేపీ పడింది. దీనికోసం బీజేపీ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటుచేసింది. గత ఎన్ని కల్లో 549 హామీలు ఇస్తే వాటిలో 520 హామీలు నెరవేర్చామని బీజేపీ వర్గాలు చెప్పాయి. హామీలో ఇచ్చిన కొన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తవుతాయని తెలిపాయి. ఎన్నికల హామీలు, వాటి ప్రగతికి సంబంధించి న సమాచారాన్ని స్పెషల్ టీం సేకరిస్తోంది. ఉద్యోగాలు సృష్టించడం, ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కల్పించడం, దేశంలో భద్రత లాంటి విషయాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలూ వీటిలో ఉన్నాయి.
బీజేపీ మేనిఫెస్టోలో లేకపోయినా ఉజ్వల, ముద్ర లాంటి విజయవంతమైన కార్యక్రమాలు అమలు జరిగిన తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దూరదృష్టితో మోడీ చేపట్టిన కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తామని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వినయ్ సహస్రాబుధే చెప్పారు. జీఎస్టీ దీంట్లో ఒకటని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలను ఎప్పుడైనా చేపట్టామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించగలదా అని వినయ్ ప్రశ్నించారు.