
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ ఒక్క ప్రాజెక్టు గురించో, ఒక భారీ పరిశ్రమనో, ఉద్యోగాల కల్పన గురించో మాట్లాడింది లేదని, సమస్యలను పరిష్కరించడం మాని మత పంచాయితీలు పెడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, రెండు కోట్ల ఉద్యోగాల మాట ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఓ దిక్కుమాలిన వ్యవహారమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే కశ్మీర్ ఫైల్స్ పై ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సినిమాను వాడుకుని ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసేందుకు సెలవులివ్వడమేంటని ప్రశ్నించారు. డెవలప్ మెంట్ ఫైల్స్ ఉండాలి కానీ, కశ్మీర్ ఫైల్స్ ఏంటన్నారు. ఓట్ల కోసం కశ్మీరీ పండిట్లను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.