- అచ్చంపేట పోలీసుల తీరు
- బీజేపీ నేతల ఒత్తిడితో బయటకు..
- విచారించి విడిచిపెట్టామన్న సీఐ
అచ్చంపేట, వెలుగు : వంద కోట్లకు నిన్ను ఎవరు కొంటారని అచ్చంపేట ఎమ్మెల్యేను ఫోన్లో దూషించాడని ఆరోపిస్తూ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పెట్ల మొరుసు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త రామాంజనేయులును సోమవారం రాత్రి అచ్చంపేట పోలీసులు పీఎస్కు తీసుకువచ్చి చితకబాదినట్టు తెలిసింది. దీంతో బీజేపీ లీడర్లు సతీశ్ మాదిగ , బాలాజీ, చందూలాల్ చౌహాన్, భరత్చంద్ర పోలీస్స్టేషన్కు వెళ్లి బీజేపీ కార్యకర్తను అక్రమంగా తీసుకువచ్చి కొట్టడాన్ని ఖండించారు. వారి ఒత్తిడితో పోలీసులు రామాంజనేయులును మంగళవారం వదిలి పెట్టారు.
ఈ సందర్భంగా సతీశ్మాట్లాడుతూ ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టిస్తూ ఎమ్మెల్యే బాలరాజు వీధి రౌడీలీ ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలోనే కొడంగల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని కూడా ఇలానే కొట్టారన్నారు. పోలీసులు ఎమ్మెల్యేకు ఊడిగం చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై అచ్చంపేట సీఐ అనుదీప్ను వివరణ కోరగా ఎమ్మెల్యేను దూషించిన విషయంలో రామాంజనేయులును పీఎస్కు తీసుకువచ్చి మంగళవారం వదిలి పెట్టామని, అతనిని కొట్టలేదని, కేవలం ప్రశ్నించామని చెప్పారు.