
- బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ నేత దిలీప్ చారి ఆందోళన
హైదరాబాద్, వెలుగు: జనసేనకు నాగర్కర్నూల్సీటు ఇవ్వొద్దని కోరుతూ నాగర్ కర్నూల్ బీజేపీ నేత దిలీప్ చారి, ఆయన అభిమానులు, కార్యకర్తలు బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు గురువారం ఆందోళనలు చేపట్టారు. నాగర్ కర్నూల్ లో జనసేన లేదని, అలాంటి పార్టీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని దిలీప్ చారి మండిపడ్డారు. జనసేన పోటీలో పెడితే వచ్చే లాభమేంటని ఆయన ప్రశ్నించారు. నల్లమట్టి అక్రమంగా రవాణా చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోరాడమని, కేసులు ఎదుర్కొన్నామని దిలీప్ చారి గుర్తు చేశారు.
తమకు న్యాయం చేసే వరకు పార్టీ ఆఫీస్ లోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మాకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపెద్ద నాయకులు పోటీకి వెనకాడాడుతుంటే, ధైర్యంగా ముందుకు వస్తుంటే ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్కు వచ్చి జేపీ నడ్డా బీజేపీని గెలిపించాలని చెప్పారని, ఇప్పుడు ఈ సీటు జనసేనకు ఇస్తామనటం ఎంత వరకు సమంజసమన్నారు. నాగర్ కర్నూలు టికెట్ బీజేపీకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.