- ఇది దృష్టి మళ్లించే చర్యన్న సీబీఐ
న్యూఢిల్లీ: సీబీఐ అధికారి మరణంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. ఎక్సైజ్ స్కాంలో తన పేరును ఇరికించాలని సదరు సీబీఐ అధికారిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోమవారం ఆరోపించారు. అయితే సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది.
ఎక్సైజ్ స్కాం దర్యాప్తుతో ఆ అధికారికి ఎలాంటి సంబంధం లేదని, ఇది తప్పుదారి పట్టించే ప్రయత్నమని మండిపడింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుపై దర్యాప్తు నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నమని సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ జితేంద్ర కుమార్ గత వారం దక్షిణ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.