
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మంగళవారం 'వీడియో రీ-కేవైసీ'ని ప్రారంభించింది. కస్టమర్లు బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారి 'నో యువర్ కస్టమర్' (కేవైసీ) డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవచ్చు. వీడియో కేవైసీ సదుపాయాన్ని పొందేందుకు, కస్టమర్లు తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసి అయి ఉండాలి. ఆధార్ నంబర్, పాన్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. మొదటి దశలో, కస్టమర్లు బీఓబీ వెబ్సైట్ను సందర్శించాలి. కొంత ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ఆన్లైన్ రీ-కేవైసీ దరఖాస్తును పూర్తి చేయాలి. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వీడియో కేవైసీ కాల్ చేస్తారు. వీడియో కాల్ కోసం కస్టమర్లకు ఒరిజినల్ పాన్ కార్డ్, ఖాళీ తెల్లటి కాగితం, నీలం/నలుపు పెన్ అవసరం. వీడియో రీ-కేవైసీ కాల్స్ అన్ని పని దినాలలో పని వేళల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 వరకు) వస్తాయి. వీడియో సెషన్ పూర్తయిన తర్వాత, కస్టమర్ వివరాలు బ్యాంక్ రికార్డులలో అప్డేట్ అవుతాయి. కస్టమర్కు టెక్స్ట్మెసేజ్కూడా వస్తుంది. రీ-కేవైసీని కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని బీఓబీ తెలిపింది. కేవైసీ (రీ-కేవైసీ) అప్డేట్ను ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కేవైసీ అప్డేట్ గడువు ముగిసినప్పుడు కస్టమర్లు వెంటనే తమ కేవైసీ పత్రాలను బ్యాంక్లో ఇవ్వాలి. పూర్తి స్థాయి డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను తెరవడానికి బీఓబీ 2021లో వీడియో కేవైసీని ప్రవేశపెట్టింది. ఇప్పుడు తమ కస్టమర్ల సౌలభ్యం కోసం వీడియో రీకేవైసీని కూడా అందుబాటులోకి తెచ్చామని బీఓబీ తెలిపింది.