- గత ఎన్నికల్లో 2.89 లక్షల ఓటర్లు.. ఇప్పుడు అప్లయ్ చేసింది 4.15 లక్షల మంది
- లక్ష ఫారాలను వెరిఫై చేస్తే 1,070 రిజెక్ట్.. ఇందులో ఆన్లైన్లో వచ్చినవే 920
నల్గొండ, వెలుగు: నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బోగస్ అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 2.89 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఈసారి అనూహ్యంగా 4.15 లక్షల మంది ఓటు కోసం అప్లై చేసుకున్నారు. వెరిఫికేషన్లో పెద్దసంఖ్యలో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతుండటం చర్చనీయాంశమైంది. ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్న ఆఫీసర్లపై పొలిటికల్ ప్రెషర్ పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వెరిఫికేషన్ కరెక్ట్గా సాగుతుందా..? లేదా.. ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని, వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చాలని ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ హైకమాండ్ఆదేశాలు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ లీడర్లు జోరుగా ఓటర్లను ఎన్రోల్ చేయించారు. గ్రాడ్యుయేట్లకు ఎన్రోల్మెంట్ ఫారాలు అందజేసి తిరిగి వాటిని కలెక్ట్ చేయడంతోపాటు, ప్రత్యేక క్యాంపు ఆఫీసులు పెట్టి మరీ ఆన్లైన్లో ఎంటర్ చేయించారు. ఈ క్రమంలో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ అప్లికేషన్స్వచ్చాయి. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లలో చాలా వరకు బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రూలింగ్పార్టీ ఈ తరహా బోగస్ ఓటర్ల నమోదుకు పాల్పడిందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగస్ ఎన్రోల్మెంట్ గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. టీజేఎస్ జిల్లా కమిటీల బాధ్యులు కూడా ఇదే విషయమై ఆయా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఓటర్ ఎన్రోల్మెంట్గడువు శుక్రవారం ముగుస్తున్నందున ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రాసెస్ను పారదర్శకంగా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్చేస్తున్నాయి. నల్గొండ– ఖమ్మం– వరంగల్ సెగ్మెంట్లో ఈ నెల 4 నాటికి 4.15 లక్షల మంది ఎన్రోల్చేసుకున్నారు. వీటిలో ఆన్లైన్ అప్లికేషన్స్ 3 లక్షల 32 వేల 56 9 రాగా.. ఆఫ్లైన్లో కేవలం 82 వేల 541 అప్లికేషన్స్ వచ్చాయి. ఆఫ్లైన్లో బోగస్ ఎన్రోల్మెంట్కు తక్కువ చాన్స్ ఉండగా, ఆన్లైన్అప్లికేషన్స్లోనే ఎక్కువ తప్పులు బయటపడుతున్నాయి.
1,070 రిజెక్ట్ అయితే.. అందులో 920 ఆన్లైన్లో వచ్చినవే
ఇప్పటివరకు బీఎల్వోలు సుమారు లక్ష ఫారాలపై ఎంక్వైరీ పూర్తి చేశారు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్లు 22 వేల 035 ఉన్నాయి. మొత్తం 1,070 ఫారాలను రిజెక్ట్ చేయగా.. వాటిలో ఆఫ్లైన్ ఫారాలు 150, మిగిలిన 920 ఆన్లైన్ఫారాలు. వీటిలో చాలా అప్లికేషన్లలో బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆఫీసర్లు మాత్రం బయటకు చెప్పడం లేదు. ఆన్లైన్అప్లికేషన్ల విషయంలో తమపై పొలిటికల్ ప్రెజర్ ఉందని కొందరు బీఎల్వోలు అంటున్నారు. పార్టీల ఇన్చార్జ్లు ఇల్లిల్లూ తిరిగి కలెక్ట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లలో తప్పులు బయటపడుతున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో డిగ్రీ సర్టిఫికెట్లపైన ఫొటోలు సరిగ్గా లేకపోవడం.. బీచులు, పార్కులు, తదితర ప్లేసుల్లో దిగిన ఫొటోలను అప్లోడ్ చేయడం, తప్పుడు అడ్రస్లు, డిగ్రీ ఫెయిల్ అయినవాళ్ల సర్టిఫికెట్లు కనిపిస్తున్నాయని, 2017 తర్వాత డిగ్రీ పాసైన వాళ్లు కూడా అప్లై చేశారని బీఎల్వోలు అంటున్నారు. కాగా, నకిలీ సర్టిఫికెట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని బీఎ ల్వోలు ఓకే చేసిన ఫారాలపై తహశీల్దారు ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్లు తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం పెట్టాల్సి ఉంటుందని ఎలక్షన్ ఆఫీసర్లు చెబుతున్నారు. బోగస్ ఓటర్ల ఏరివేత కోసం తహసీల్ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్ఆఫీసర్ల హోదాలో డీటీలను నియమించామని అంటున్నారు.