గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఓట్ల కోసం బోగస్​ అప్లికేషన్లు!

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఓట్ల కోసం బోగస్​ అప్లికేషన్లు!

 

  •     గత ఎన్నికల్లో 2.89 లక్షల ఓటర్లు.. ఇప్పుడు అప్లయ్​ చేసింది 4.15 లక్షల మంది
  •     లక్ష ఫారాలను వెరిఫై  చేస్తే 1,070 రిజెక్ట్..  ఇందులో ఆన్​లైన్​లో వచ్చినవే 920​

నల్గొండ, వెలుగు: నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బోగస్​ అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 2.89  లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఈసారి అనూహ్యంగా 4.15 లక్షల మంది ఓటు కోసం అప్లై చేసుకున్నారు. వెరిఫికేషన్​లో పెద్దసంఖ్యలో అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతుండటం చర్చనీయాంశమైంది. ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్  చేస్తున్న ఆఫీసర్లపై పొలిటికల్​ ప్రెషర్  పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వెరిఫికేషన్  కరెక్ట్​గా సాగుతుందా..? లేదా.. ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్​రోల్​మెంట్​ కార్యక్రమాన్ని సీరియస్​గా తీసుకోవాలని, వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చాలని ఎమ్మెల్యేలకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ఆదేశాలు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్​ఎస్​ లీడర్లు జోరుగా ఓటర్లను ఎన్​రోల్​ చేయించారు. గ్రాడ్యుయేట్లకు ఎన్​రోల్​మెంట్​ ఫారాలు అందజేసి తిరిగి వాటిని కలెక్ట్  చేయడంతోపాటు, ప్రత్యేక క్యాంపు ఆఫీసులు పెట్టి మరీ ఆన్​లైన్​లో ఎంటర్ చేయించారు. ఈ క్రమంలో ఆఫ్​లైన్​ కంటే ఆన్​లైన్​లోనే ఎక్కువ అప్లికేషన్స్​వచ్చాయి. ఆన్​లైన్​లో వచ్చిన అప్లికేషన్లలో చాలా వరకు బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రూలింగ్​పార్టీ ఈ తరహా బోగస్​ ఓటర్ల నమోదుకు పాల్పడిందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీజేఎస్ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం  ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగస్​ ఎన్​రోల్​మెంట్​ గురించి పదేపదే  ప్రస్తావిస్తున్నారు. టీజేఎస్​ జిల్లా కమిటీల బాధ్యులు కూడా ఇదే విషయమై ఆయా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఓటర్ ఎన్​రోల్​మెంట్​గడువు శుక్రవారం ముగుస్తున్నందున ఆన్​లైన్​లో వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్  ప్రాసెస్​ను  పారదర్శకంగా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్​చేస్తున్నాయి.  నల్గొండ– ఖమ్మం– వరంగల్  సెగ్మెంట్​లో ఈ నెల 4 నాటికి 4.15 లక్షల మంది ఎన్​రోల్​చేసుకున్నారు. వీటిలో ఆన్​లైన్​ అప్లికేషన్స్  3 లక్షల 32 వేల 56 9 రాగా.. ఆఫ్​లైన్​లో కేవలం 82 వేల 541 అప్లికేషన్స్​ వచ్చాయి.  ఆఫ్​లైన్​లో బోగస్​ ఎన్​రోల్​మెంట్​కు తక్కువ చాన్స్​ ఉండగా, ఆన్​లైన్​అప్లికేషన్స్​లోనే ఎక్కువ తప్పులు  బయటపడుతున్నాయి.

1,070 రిజెక్ట్​ అయితే.. అందులో 920 ఆన్​లైన్​లో వచ్చినవే

ఇప్పటివరకు బీఎల్​వోలు సుమారు లక్ష ఫారాలపై ఎంక్వైరీ పూర్తి చేశారు. ఇందులో ఆన్​లైన్​ అప్లికేషన్లు 22 వేల 035 ఉన్నాయి.  మొత్తం 1,070 ఫారాలను రిజెక్ట్ చేయగా..  వాటిలో ఆఫ్​లైన్​ ఫారాలు  150,  మిగిలిన  920 ఆన్​లైన్​ఫారాలు.  వీటిలో చాలా అప్లికేషన్లలో బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆఫీసర్లు మాత్రం బయటకు చెప్పడం లేదు. ఆన్​లైన్​అప్లికేషన్ల విషయంలో తమపై పొలిటికల్​ ప్రెజర్​ ఉందని  కొందరు బీఎల్​వోలు అంటున్నారు. పార్టీల ఇన్​చార్జ్​లు ఇల్లిల్లూ తిరిగి  కలెక్ట్ చేసి ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసిన సర్టిఫికెట్లలో తప్పులు బయటపడుతున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్​లో డిగ్రీ సర్టిఫికెట్లపైన ఫొటోలు సరిగ్గా లేకపోవడం.. బీచులు, పార్కులు, తదితర ప్లేసుల్లో దిగిన ఫొటోలను అప్​లోడ్​ చేయడం, తప్పుడు అడ్రస్​లు,  డిగ్రీ ఫెయిల్ అయినవాళ్ల సర్టిఫికెట్లు కనిపిస్తున్నాయని, 2017 తర్వాత డిగ్రీ పాసైన వాళ్లు కూడా అప్లై చేశారని బీఎల్​వోలు అంటున్నారు. కాగా,  నకిలీ సర్టిఫికెట్లపై స్పెషల్​ ఫోకస్​ పెట్టామని బీఎ ల్​వోలు ఓకే  చేసిన ఫారాలపై తహశీల్దారు ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్లు తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం పెట్టాల్సి ఉంటుందని ఎలక్షన్​ ఆఫీసర్లు చెబుతున్నారు. బోగస్  ఓటర్ల ఏరివేత కోసం తహసీల్ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్​ఆఫీసర్ల హోదాలో డీటీలను నియమించామని అంటున్నారు.