
కొచ్చిలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కేరళ రాష్ట్రం, కాలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషన్ ప్రార్థన మందిరం వద్ద.. 2023, అక్టోబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. గంట వ్యవధిలో రెండు, మూడు పేలుళ్లు సంభవించిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పేలుళ్ల సమయంలో కన్వేషన్ సెంటర్ లో 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రార్థన మందిరం వద్ద పేలుళ్లు అత్యంత దురదృష్టకరమని.. ఈ పేలుళ్లపై డీజీపీతో మాట్లాడానని తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పినరయ్ పేర్కొన్నారు. ఈ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు.