శంషాబాద్, వెలుగు: లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు వచ్చిన ఈ విమానంలో బాంబు పెట్టినట్టు గుర్తుతెలియని వ్యక్తి ఏవియేషన్ అధికారులకు మెయిల్ పెట్టాడు. ఆ సమయంలో విమానంలో 203 మంది ప్రయాణికులున్నారు.
దీంతో విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే వారిని కిందకు దింపి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు కలిసి ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనంతరం బాంబు లేదని తేల్చారు. దీనిపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
