పరువునష్టం కేసు: రాహుల్‌ గాంధీకి ముంబై హైకోర్టులో స్వల్ప ఊరట

పరువునష్టం కేసు: రాహుల్‌ గాంధీకి ముంబై హైకోర్టులో స్వల్ప ఊరట

ప్రధాని నరేంద్ర మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న రాహుల్‌గాంధీకి స్వల్ప ఉరట లభించింది. కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు పొడిగించింది. ఆగష్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపునిచ్చింది. 

మోడీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు భాజపాకి చెందిన మహేశ్‌ శ్రీశ్రీమల్‌ 2021లో పరువునష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాహుల్‌ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ స్థానిక కోర్టు  గతంలో సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌వీ కొత్వాల్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఇప్పుడు ఆ మినహాయింపును ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, మరోవైపు ఇదే అంశంపై గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ పరువునష్టం దావా వేయడంతో.. సూరత్‌ కోర్టు  రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం.. వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్‌ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రెటేరియేట్‌ రద్దు చేసింది.