
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క, ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ భూరియాను పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడె గజేందర్ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సత్కరించి, ఆదిలాబాద్ జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని మంత్రి సూచించారన్నారు. బోథ్నియోజకవర్గంలోని సమస్యలను ఆమెకు వివరించినట్లు పేర్కొన్నారు.
నేడు మంత్రి సీతక్క రాక
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టరేట్ భవన సముదాయంలో శనివారం ఉదయం 9-.30 గంటలకు నిర్వహించనున్న సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరు కానున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి తదితర అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. అధికారులు తమ శాఖల పురోగతిపై పూర్తి వివరాలతో రావాలని సూచించారు.