
- స్థానికులు తరమడంతోతప్పిన ప్రాణాపాయం
- దాడి చేసిన కుక్కలను బంధించిన బల్దియా
- అల్లాపూర్ పీఎస్ పరిధిలోనిరాణా ప్రతాప్ నగర్లో ఘటన
పంజాగుట్ట, వెలుగు : అల్లాపూర్ పీఎస్ పరిధిలోఉన్న రాణా ప్రతాప్నగర్లో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిని కుక్కలు లాక్కెళ్లాయి. చుట్టుపక్కల వారు చూసి తరమడంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాణాప్రతాప్నగర్లో ఉంటున్న అల్తాఫ్ఖాన్, వాజిదా బేగం దంపతులకు రెండేండ్ల కొడుకు నవాజ్ఖాన్ఉన్నాడు.
తండ్రి అల్తాఫ్ సికింద్రాబాద్లోని పాన్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య వాజిదా బేగం దివ్యాంగురాలు. ఈమె ఇంటి వద్దే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న నవాజ్ ఖాన్. ఇంట్లోకి వెళ్తుండగా రెండు కుక్కలు వెంటపడ్డాయి. ఒక్కసారిగా దాడి చేసి కాళ్లను పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లాయి. అప్పుడే మరో రెండు కుక్కలు వచ్చి కరవడానికి ప్రయత్నించాయి. కొంతదూరం నుంచి ఓ వ్యక్తి, ఇంట్లోంచి ఓ మహిళ అరుస్తూ పరిగెత్తుకు రావడంతో కుక్కలు పారిపోయాయి. బాలుడిని వెంటనే నిలోఫర్దవాఖానకు తరలించి చికిత్స చేయించి సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు.
శ్మశానం.. రైల్వే లైన్ ఉండడంతో
బాధితుల ఇంటి ఎదురుగా రైల్వే లైన్తోపాటు శ్మశానం ఉంది. దీంతో వీధి కుక్కలంతా అక్కడ జమవుతున్నాయి. శ్మశానం నుంచి రైల్వే లైన్దాటుకుంటూ ఇండ్ల వద్దకు వచ్చి మనుషులతోపాటు, మేకలు, కోళ్లను కరుస్తున్నాయని బాధిత బాలుడి తాత మహ్మద్ఇలియాస్ చెప్పారు. గతంలోనూ ఓ బాలుడిని తీవ్రంగా గాయపర్చాయని, 8 కోళ్లు, మేకను చంపేశాయని చెప్పాడు. రైల్వే లైన్వద్ద ప్రహారీ నిర్మించాలని కోరితే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. ఘటన గురించి తెలుసుకున్న బల్దియా వెటర్నరీ విభాగం ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి బాలుడి ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బల్దియా సిబ్బంది ఆ ఏరియాకు వచ్చి దాడి చేసిన కుక్కలను పట్టుకున్నారు.
చంపాపేటలో ముగ్గురు పిల్లల పై కుక్కల దాడి
ఎల్బీనగర్: చంపాపేట డివిజన్లో వీధి కుక్కల దాడిలో ఆదివారం ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మాధవనగర్ రోడ్డు నంబర్ 2 హిమాన్షు(5) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అలాగే రోడ్ నంబర్9లో ఇంటి బయట ఉన్న వినేశ్(7) ను కరిచాయి. అలాగే ఎస్వీ కాలనీలోని ఓ చిన్నారిపై దాడి చేశాయి. స్థానికులు కుక్కల తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. హిమాన్షు స్థానిక దవాఖానలో, వినేశ్ నల్లకుంటలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.