తండ్రి తిట్టిండని దుర్గం చెరువులో దూకి కొడుకు సూసైడ్

తండ్రి తిట్టిండని దుర్గం చెరువులో దూకి కొడుకు సూసైడ్

మాదాపూర్, వెలుగు: పనిచేయకుండా ఇంట్లో ఉంటే కుటుంబాన్ని ఎలా షోషిస్తావంటూ  తండ్రి తిట్టాడనే మనస్తాపంతో కొడుకు దుర్గం చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రత్యూష తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వి. సంపత్ రావు(45) క్యాబ్ నడుపుకునేందుకు తండ్రి నారాయణ రావు అతడికి ఓ కారు కొనిచ్చాడు.  సంపత్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ  కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కొద్దిరోజులుగా క్యాబ్ నడపకుండా ఇంట్లో ఉంటున్నాడు. పనిచేయకపోతే కుటుంబం ఎలా గడుస్తుందని తండ్రి నారాయణరావు మంగళవారం సంపత్ ను మందలించాడు. మనస్తాపం చెందిన సంపత్ చనిపోతానంటూ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు.  అదే రోజు సాయంత్రం బైక్ పై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకున్నాడు. బైక్ ను బ్రిడ్జి మీదనే వదిలేసి చెరువులోకి దూకాడు. సంపత్ ఎంతసేపటికీ  ఇంటికి రాకపోవడంతో అతడి తండ్రి నారాయణరావు మాదాపూర్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు.

కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం కేబుల్ బ్రిడ్జిపై బైక్ ను గుర్తించారు. బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి దుర్గం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు చెరువులో సంపత్ డెడ్ బాడీని గుర్తించి బయటికి తీసుకొచ్చారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.